ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : కివీస్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

ఆదివారం, 22 అక్టోబరు 2023 (11:29 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం న్యూజిలాండ్ జట్టు భారత కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికీ చీలమండ గాయంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా గాయపడినట్టు సమాచారం. 
 
నెట్స్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో త్రోడౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి సూర్య మణికట్టుకు తగిలింది. బలంగా తగలడంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. దీంతో సెషన్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
 
హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఫినిషర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అతడు గాయంపాలవ్వడం జట్టును కలవరపరిచే అంశంగా పరిగణించాలి. గాయం తీవ్రత ఎంత, మ్యాచ్‌లో చోటు దక్కుతుందా లేదా అని వేచిచూడాల్సి ఉంది. 
 
ఇదిలావుంటే, ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్‌ను తేనెటీగ మెడపై కుట్టింది. దీంతో అతడు కూడా ప్రాక్టీసికి దూరమయ్యాడు. అయితే ఇషాన్‌కు ఎలాంటి లేదని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్‌లో రెండు జట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. చెరో నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. 
 
మెరుగైన నెట్‌ రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే, 2003 నుంచీ ఏ ఐసీసీ టోర్నీలోనూ కివీస్ జట్టును భారత్ ఓడించకపోవడం గమనార్హం. దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత జట్టుకు స్వదేశంలో లభించింది. ఈ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు