ఆస్ట్రేలియాను ఊరిస్తున్న సిడ్నీ టెస్ట్ : డ్రా కోసం భారత్ ఆట

ఆదివారం, 10 జనవరి 2021 (14:05 IST)
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును విజయం ఊరిస్తోంది. ఆ జట్టు నిర్ధేశించిన 407 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ విజయానికి మరో ఎనిమిది వికెట్లు కావాల్సివుండగా, మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలివుంది. భారత్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 
 
అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 312/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లబుషానే 73 పరుగులు చేయగా, స్మిత్ 81 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ బ్యాటింగ్ అంటే యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ దేనని చెప్పాలి. గ్రీన్ 8 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి ఆసీస్ ఆధిక్యం మరింత పెరగడానికి కారకుడయ్యాడు. కెప్టెన్ టిమ్ పైన్ కూడా చివర్లో ధాటిగా ఆడి 6 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సైనీ 2, అశ్విన్ 2, బుమ్రా 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా, భారత్ 244 పరుగులు సాధించింది.
 
ఆ తర్వాత 407 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 52, శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ కావడంతో పుజారా, రహానే బరిలో దిగారు. టీమిండియా విజయానికి ఇంకా 309 పరుగులు అవసరం కాగా, పుజారా 9, రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 
ఆటకు మరొక్క రోజు మాత్రమే మిగిలుండగా, టీమిండియా ఆశలన్నీ ఈ జోడీపైనే ఉన్నాయి. పుజారా, రహానే భారీ భాగస్వామ్యం నమోదు చేస్తే విజయం కష్టమేమీ కాదు కానీ, సొంతగడ్డపై ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కొని అన్ని పరుగులు చేయగలరా అనేది సందేహమే!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు