ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిన అశ్విన్ : చెన్నై టెస్టులో సెంచరీ

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:02 IST)
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆర్.అశ్విన్ సెంచరీ చేశాడు. టీమిడియాకు చెందిన టాప్ ఆర్డర్ బౌలర్లంతా ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలపడుతుంటే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ సెంచరీ సాధించాడు. 
 
మొయిన్ అలీ బౌలింగ్లో ఫోర్ కొట్టి శతకం అందుకున్న అశ్విన్ భారత ఇన్నింగ్స్‌కు మరింత ఊపు తెచ్చాడు. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఐదో సెంచరీ కాగా, ఒకే టెస్టులో 5 వికెట్లు, సెంచరీ సాధించడం అతడికిది మూడోసారి. హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రీతిలో ఎంతో క్లిష్టమైన స్పిన్ పిచ్‌పై పూర్తి సాధికారతతో ఆడిన అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పవచ్చు.
 
ఇక అశ్విన్ సెంచరీతో చెన్నై టెస్టులో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 286 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 482 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 106 పరుగులు చేసిన అశ్విన్... ఇంగ్లండ్ పేసర్ ఒల్లీ స్టోన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు అశ్విన్ ప్రోత్సాహంతో సిరాజ్ (16 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. సిరాజ్ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. అశ్విన్ స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. అలాగే, ఇంగ్లండ్ జట్ట తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసింది. ఆ తర్వాత 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తన రెండో ఇన్నింగ్స్‌లో అపుడే మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు మిగిలివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు