రాంచీ టెస్ట్ మ్యాచ్ : 152 పరుగుల దూరంలో భారత్ గెలుపు

వరుణ్

ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (17:01 IST)
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయానికి 152 పరుగుల దూరంలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (14), రోహిత్ శర్మ (24) చొప్పున పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 విజయ లక్ష్యం కోసం భారత్ మరో 152 పరుగుల దూరంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలివుండటంతో పాటు.. చేతిలో పది వికెట్లు ఉండటంతో భారత్ గెలుపు ఖాయంగా తెలుస్తుంది. అయితే, నాలుగో రోజు తొలి సెషన్‌లో కాసేపు ఇంగ్లండ్ బౌలర్లను అడ్డుకోగలిగితే విజయం తేలికవుతుంది.
 
కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు దెబ్బతీశారు. వీరిద్దరూ ఏకంగా తొమ్మి వికెట్లు పడగొట్టారు. అశ్విన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అలాగే, ఇంగ్లండ్ ఆటగాళ్లలో జాక్ క్రాలే 60 పరుగులు చేయగా జానీ బెయిర్ స్టో 30, బెన్ ఫోక్స్ 17 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళలో బెన్ డకెట్ 15, ఓలీ పోప్ 0, జో రూట్ 11, కెప్టెన్ బెన్ స్టోక్స్ 4, టామ్ హార్ట్ లీ 7, ఓలీ రాబిన్ సన్ 0, జేమ్స్ ఆండర్సన్ 0 చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా 53.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
కాగా, మూడో రోజు టీ బ్రేక్‌ తర్వాత ఇంగ్లండ్ ఐదు వికెట్లను కోల్పోయింది. 120/5 స్కోరుతో మూడో సెషన్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 25 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 35వసారి. ఈ జాబితాలో కుంబ్లేతో సమంగా నిలిచాడు. అయితే, అశ్విన్‌ 99 మ్యాచుల్లో సాధించగా.. కంబ్లే 132 టెస్టులు తీసుకున్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు, షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైఫర్ తీశారు.
 
బెన్‌ స్టోక్స్ - మెక్‌కల్లమ్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ 3 రన్‌రేట్‌ కంటే తక్కువగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అత్యల్పంగా 3.13 రన్‌రేట్‌తో చేయగా.. ఈ మ్యాచ్‌లో 2.69 రన్‌రేట్‌తోనే ఆడటం గమనార్హం. భారత్‌ వేదికగా టెస్టుల్లో పర్యటక జట్టు ఏదీ 200 కంటే తక్కువైన టార్గెట్‌ను కాపాడుని గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు 32 సందర్భాల్లో మూడుస్లారు డ్రా కాగా.. 29 మ్యాచుల్లో ఓటములను చవిచూశాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 4000+ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 58 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు