చెన్నై టెస్ట్ : భారత్ తొలి ఇన్నింగ్స్ 329 ఆలౌట్

ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:23 IST)
చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజున భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించాడు. శనివారం 88 ఓవర్ల పాటు ఆడి 6 వికెట్ల నష్టానికి 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇండియా, మరొక్క పరుగు జోడించి, అక్సర్ పటేల్, ఇషాంత్ శర్మ వికెట్లను కోల్పోయింది.
 
వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌కు టెయిలెండర్లు ఎవరూ అండగా నిలువలేకపోవడంతో, తొలిరోజు స్కోరుకు మరో 29 పరుగులు జోడించే లోగానే భారత జట్టు తన చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది.
 
కాగా, ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి 161 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 0, ఛటేశ్వర్ పుజారా 21, విరాట్ కోహ్లీ 0, అజింక్యా రహానే 67, రవిచంద్రన్ అశ్విన్ 13, అక్సర్ పటేల్ 5, ఇషాంత్ శర్మ 0, కుల్ దీప్ యాదవ్ 0, మహమ్మద్ సిరాజ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 58 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
 
ఇక ఇదేసమయంలో ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీకి 4, ఓలీ స్టోన్‌కు 3 వికెట్లు లభించగా, జాక్ లీచ్ కు 2, జోయ్ రూట్ కు 1 వికెట్ లభించాయి. మరికాసేపట్లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. పిచ్ బౌలింగ్ కు, ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ ఉండటంతో భారత బౌలర్లు రాణించవచ్చని క్రీడా పండితులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు