ముక్కోణపు టీ20 టోర్నీ : పెరీరా ఊచకోత... భారత్‌పై లంక విజయం

బుధవారం, 7 మార్చి 2018 (10:35 IST)
సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న ముక్కోణపు ట్వంటీ20 టోర్నీలో భాగంగా, తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ధనాధన్‌ దూకుడు మినహా భారత ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోవడం కొంపముంచింది. ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కుశాల్‌ పెరీరా (37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) వీర బాదుడుకు భారత బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 
 
శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు సాధించాడు. అతడికి మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లేకపోయినా అంతా తానై లంక ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కుశాల్‌ అవుటయ్యాక మ్యాచ్‌ కాస్త భారత్‌ వైపు మొగ్గు చూపినా తిసార పెరీరా వరుస బౌండరీలతో లంకను గట్టెక్కించి అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. 
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 174 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90) చెలరేగగా మనీష్‌ పాండే (35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 23) ఫర్వాలేదనిపించారు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (6 బంతుల్లో 2 ఫోర్లతో 13) వేగంగా ఆడాడు. చమీరకు రెండు వికెట్లు దక్కాయి. 
 
ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 18.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ను తీసింది. కానీ ఆ సంతోషం కుశాల్‌ పెరీరా ఊచకోతతో ఆవిరైపోయింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన శార్దుల్‌ ఠాకూర్‌ బంతులకు అతడు శివతాండవమే చేశాడు. వరుసగా 4, 4, 4, 6, 4 (నోబ్‌), 4తో 27 పరుగులు సాధించాడు. అలాగే, గుణతిలక (19), తరంగ (17), షనక (15 నాటౌట్‌) చొప్పున పరుగులు చేయడంతో 18వ ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు