అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్‌గా ఐసీసీ చైర్మన్‌గా జై షా..

వరుణ్

మంగళవారం, 9 జులై 2024 (15:59 IST)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడుగా జై షా ఎంపికకానున్నారు. ప్రస్తుతం ఈయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శిగా ఉన్నారు. ఈ యేడాది నవంబరులో ఐసీసీ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయని, పోటీ చేయాలని భావిస్తే జై షాకు ఎలాంటి పోటీ ఉండబోదని కథనం పేర్కొంది. జై షా భావిస్తే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే నుంచి బాధ్యతలు అందుకునేందుకు పోటీ పడే ప్రధాన అభ్యర్థి ఆయనేనని విశ్లేషించింది.
 
కాగా చైర్మన్ పదవికి పోటీ విషయంలో జై షా తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఐసీసీ పాలనలో మార్పులు తీసుకురావాలని జై షా భావిస్తున్నారని, ముఖ్యంగా ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఐసీసీ కార్యకలాపాలలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా ఐసీసీ చైర్మన్ పదవీకాలం ప్రస్తుతం రెండు సంవత్సరాలు ఉండగా దానిని మూడేళ్లకు పెంచారు. అయితే తిరిగి ఈ పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా 2009లో జై షా తన క్రికెట్ పాలన నిర్వహణతో తన అనుబంధాన్ని మొదలుపెట్టారు. 2015లో బీసీసీఐలో చేరారు. సెప్టెంబరు 2019లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు