కోల్‌కతా నైట్ రైడర్స్... ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది..

ఠాగూర్

సోమవారం, 27 మే 2024 (13:12 IST)
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకున్న జట్ల జాబితాలో కేకేఆర్ నిలిచింది. గత 2012, 2014 తర్వాత అంటే దశాబ్దకాలం తర్వాత కేకేఆర్ జట్టు విజేతగా నిలిచింది. అదేసమయంలో మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిరాశే మిగిలింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు.. 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప టార్గెట్‌ను కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. కేవలం 10.3 ఓవర్లలో 8 వికెట్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మొత్తం 29 ఓవర్ల పాటు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్.. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన ప్లేఆఫ్ మ్యాచ్‌గా నిలిచింది. 
 
గత 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్ మధ్య జరిగిన ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ 32.2 ఓవర్ల పాటు కొనసాగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 18.3 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో 13.5 ఓవర్లలో ఆర్సీబీ మ్యాచ్‌ను ముగించింది. ఆ రికార్డు ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెరిగిపోయింది.
 
కాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్ల ముందు అందరూ తేలిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకొని మ్యాచ్‌ను దూరం చేసుకున్నారు. 24 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడంటే ఆ జట్టు ఆటగాళ్లు ఎంత దారుణంగా విఫలమయ్యారో చెప్పవచ్చు. లక్ష్య ఛేదనలో వెంకటేష్ అయ్యర్ అజేయ అర్థశతకంతో ఆ జట్టు సునాయాసంగా గెలిచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు