విరాట్ కోహ్లీ... డబుల్స్‌లో లారాను దాటేశాడు...

ఆదివారం, 3 డిశెంబరు 2017 (11:49 IST)
భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల జోరు కొనసాగుతోంది. ఇఫ్పటికే సెంచరీల మోతలో.. పరుగుల వరదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న కోహ్లీ…  ఆదివారం మరో రికార్డును చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 
 
ప్రస్తుతం శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించాడు. 238 బంతులు ఆడిన కోహ్లీ… 84.50 స్ట్రైక్ రేట్‌తో డబుల్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ కాగా… కెరీర్‌లో ఆరోది. అంతకు ముందు నాగ్‌పూర్ టెస్టులో కూడా డబుల్ సెంచరీ చేశాడు కోహ్లీ. అత్యధికంగా డబుల్ ధమాకాలు సృష్టించిన టెస్టు క్రికెటర్‌లలో కోహ్లీది 12వ స్థానం. 
 
కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన లారా రికార్డును బ్రేక్ చేశాడు. లారా కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలు చేయగా… కోహ్లీ ఆరు చేశాడు. కోహ్లీ కంటే ముందు టాప్ ప్లేస్‌లో డొనాల్డ్ బ్రాడ్‌మెన్ (12), సంగర్కర(11), లారా(9), హేమండ్(7) ఉండగా… భారత క్రికెటర్లలో సచిన్(6), సెహ్వాగ్(6)ల సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు. 
 
ఇకపోతే, కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు (6) సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డుకెక్కాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (5) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే భారత్‌ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ చెరో ఆరు డబుల్ సెంచరీలు సాధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు