చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో భారీ నష్టాల్లో పాక్ క్రికెట్ బోర్డు!!

ఠాగూర్

సోమవారం, 17 మార్చి 2025 (16:14 IST)
సుధీర్ఘకాలం తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా లాభాలను అర్జించకపోగా భారీ లాభాలను మూటగట్టుకుంది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ జట్టే. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే దారుణమైన ప్రదర్శనతో పాకిస్థాన్ వైదొలగడం ఒక ఎత్తు అయితే, టీమిండియా టైటిల్ గెలుచుకోవడం దానికి మింగుడుపడని విషయం. 
 
మరోవైపు, దుబాయ్‌లో ట్రోఫీ బహూకరణ సమయంలో పాకిస్థాన్‌ ప్రతినిధులను పోడియం పైకి ఆహ్వానించకపోవడంతో మరింత అవమానభారంతో కుంగిపోయింది. మరోవైపు, ఈ టోర్నీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోది. దీంతో ఆ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. 
 
ఆతిథ్య దేశం అయినప్పటికీ పాకిస్థాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. లాహోర్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఇక బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. 
 
ఈ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 18 బిలియన్ పాక్ కరెన్సీని ఖర్చు చేశారు. రావల్పిండి, లాహోర్‌, కరాచీ స్టేడియాల ఆధునికీకరణ కోసం ఈ నిధులను వెచ్చించింది. అయితే, ఈ అంచనా వేసిన బడ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ. దీంతో ఈవెంట్ సన్నాహాల కోసం 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అయితే, హోస్టింగ్ ఫీజులో భాగంగా పీసీబీ 6 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకున్నట్టు సమాచారం. ఇక టిక్కెట్ అమ్మకాలు, స్పాన్సర్ షిప్‌ల విషయానికి వస్తే వాటి ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ టోర్నీ నిర్వహణ ద్వారా పాక్ క్రికెట్ బోర్డు రూ.869 కోట్ల మేరకు నష్టాలను చవిచూసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు