బ్రాండ్ విలువలో విరాట్ కోహ్లీ టాప్.. మోదీని కలిసిన కొత్త జంట..

గురువారం, 21 డిశెంబరు 2017 (10:54 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ పెరుగుతోంది. దేశంలోనే అత్యంత విలువైన సెలెబ్రిటీ బ్రాండ్‌గా విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ వెనక్కి నెట్టేశాడు. గత ఏడాదితో పోలిస్తే కోహ్లీ బ్రాండ్ ఏకంగా 56 శాతం పెరిగి రూ.921 కోట్లకు చేరింది. ఈ ఏడాది. అక్టోబరు నాటికి కోహ్లీ 20, షారూక్ 21 బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. 
 
డఫ్ అండ్ ఫెల్ప్స్ ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాక షారూక్ తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రూ.678  కోట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో దీపిక పదుకొనే, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ నిలిచారు. 
 
ఇదిలా ఉంటే.. కొత్త జంట విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలో ఇవ్వనున్న వివాహ విందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ విరాట్ దంపతులను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.
 
టీమిండియా సారథి కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు