అక్తర్ ప్రతిపాదన సరైంది కాదు.. ఇండో-పాక్ సిరీస్‌పై శ్రీశాంత్

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:21 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌పై భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ స్పందించాడు. విపత్కర పరిస్థితుల్లో భారత్‌, పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించి వచ్చిన డబ్బును ఇరుదేశాలు సమానంగా పంచుకుంటే మంచిదన్న పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదన ఏమాత్రం సరైంది కాదన్నాడు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు సవ్యంగా లేవని ఇలాంటి సమయంలో సిరీస్ నిర్వహించడం సరికాదని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 
 
భారత్ ఆరోగ్యంపైనే దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సఖ్యత లేదు. తన వరకైతే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటం ఏమాత్రం ఇష్టం లేదని శ్రీశాంత్ అన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో టీమిండియాకు దూరమైనాడు. 
 
2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అతడిపై విధించిన నిషేధాన్ని గతేడాది మార్చి 15న సుప్రీం‌కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆగస్టుతో శ్రీశాంత్‌పై విధించిన నిషేధ కాలం పూర్తవుతుంది. దీంతో అతడు కేరళ, టీమిండియాకు ఆడే అర్హత సాధిస్తాడు. ఓ కార్యక్రమంలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తన భార్య భువనేశ్వరిని తొలి చూపులోనే ప్రేమించా అని శ్రీశాంత్‌ అన్నాడు. 2011 ప్రపంచకప్‌ నాటి విశేషాలను గుర్తుచేసుకున్న శ్రీశాంత్‌.. ఆ టోర్నీలో ఆందోళన చెందానని చెప్పాడు. అలాంటి సమయంలో సచిన్‌‌ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్‌ తన వద్దకొచ్చి ప్రోత్సహించారు. 
 
మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతున్నందున జట్టులోని ప్రతీ ఒక్కరూ సచిన్‌ కోసమే ఎలాగైనా ప్రపంచకప్‌ గెలవాలని నిశ్చయించుకున్నామని.. అలా సమిష్టిగా గెలుచుకుని.. సచిన్‌కు కప్ సాధించిపెట్టామన్నాడు. 1983 ప్రపంచకప్‌ హీరో కపిల్‌ దేవ్‌ను అత్యుత్తమ కెప్టెన్‌గా అభివర్ణించాడు. ఇక ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, జస్ప్రీత్‌ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అని అభిప్రాయపడ్డాడు.
 
విరాట్ కోహ్లీ లాగా తాను నిత్యం ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఫిట్‌నెస్‌లో లెగ్స్ ఎక్స్‌ర్‌సైజ్ తనకు ఇష్టమైని తెలిపాడు. తన కెరీర్ ఆరంభంలో దాదా తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని తెలిపాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి తాను ప్రొఫెషనల్ క్రికెట్ ప్రపంచంలోకి రానున్నట్లు చెప్పాడు. ధోనీ దిగ్గజ క్రికెటర్ అని కొనియాడిన శ్రీశాంత్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియాకు తిరిగి ఆడాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు