సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. యాంజియోప్లాస్టీ చేయాలట

శనివారం, 2 జనవరి 2021 (14:49 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఉందని దవాఖాన వర్గాలు చెప్పినట్లు సమాచారం. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న సమాచారం రాగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమం కోరుతూ వివిధ ఆలయాల్లో ప్రార్థనలు చేశారు.
 
శనివారం ఉదయం వేళ ఎప్పటిమాదిరిగానే తేన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అసౌకర్యంగా ఫీలయ్యాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. గుండెలో నొప్పిగా ఉన్నదంటూ గంగూలీ ఫిర్యాదు చేశాడు. దాంతో ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డార్టర్‌ సరోజ్‌ మొండల్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం.. గుండెకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. 
 
యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత భారత మాజీ కెప్టెన్‌ను శనివారం డిశ్చార్జ్ చేస్తారని బోరియా మజుందార్ ధ్రువీకరించారు. అహ్మదాబాద్‌లో డిసెంబర్‌ 24 న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన గంగూలీ.. అనంతరం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో నెలకొల్పిన అరుణ్‌ జైట్లీ విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో కలిసి పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు