భారత్ - ఆస్ట్రేలియా టీ20 టోర్నీ... హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వైజాగ్ మ్యాచ్ టిక్కెట్లు

శనివారం, 18 నవంబరు 2023 (10:55 IST)
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుంది. ఈ ఫైనల్ పోరు తర్వాత ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ వైజాగ్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం శుక్రవారం నుంచి మొదలుపెట్టగా, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 
 
ఈ టిక్కెట్ల విక్రయాన్ని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం, గాజువాకలో రాజీవ్‌గాంధీ స్టేడియంల వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. తొలిరోజు 5 వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, రూ.600 టికెట్లు గంట వ్యవధిలోనే అయిపోయాయి. క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చున్నా టికెట్లు దొరక్కపోవడంతో పలువురు అభిమానులు నిరాశ చెందారు. 
 
మురికివాడల నుంచి వచ్చిన పలువురు మహిళలు గురువారం అర్థరాత్రి నుంచే క్యూలైనులో కాపు కాశారు. వీరి ద్వారా బ్లాక్‌లో ఆయా టికెట్లను విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి కౌంటర్లను పరిశీలించారు. రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.3,500, రూ.6 వేల విలువ కలిగిన టికెట్లు రోజుకు 5 వేల చొప్పు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. శనివారం కూడా ఆయా కేంద్రాల వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంల వద్ద ఈ నెల 22 లోగా, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం వద్ద 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు