పరుగుల వరద పారిస్తున్న యశస్వి జైస్వాల్ - ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 618 రన్స్...

వరుణ్

ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (14:36 IST)
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. భారత జాతీయ జట్టులో తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ద్వారా కెరియర్‌‍లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. చక్కటి ఫామ్‌లో ఉన్న ఈ ఓపెనర్ పరుగుల వరద పారిస్తున్నాడు. క్యాలెడర్ యేడాది 2024లో ఇప్పటివరకు ఏడు టెస్ట్ ఇన్నింగ్స్‌ ఆడిన జైస్వాల్ ఏకంగా 618 పరుగులు బాదాడు. ఈ యేడాది కేవలం మొదటి 55 రోజుల్లో ఈ రికార్డు స్థాయి పరుగులు సాధించాడు. 
 
ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా జైస్వాల్ అవతరించాడు. ఈ యేడాది మొదటి 55 రోజుల్లో జైస్వాల్ ఏకంగా 23 సిక్సర్లు బాదాడు. 2008లో వీరేంద్ర సెహ్వాగ్ 28 ఇన్నింగ్స్ ఆడి 22 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును యువ కెరటం జైస్వాల్ బ్రేక్ చేశాడు.
 
ఒక క్యాలెండర్ యేడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలించాడు. ఈ యేడాదిలో ఇప్పటివరకు 23 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో 22 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్, మూడో స్థానంలో రిషబ్ పంత్ (21 సిక్సర్లు), రోహిత్ శర్మ 20 సిక్సర్లత నాలుగో స్థానంలో, యమాంక్ అగర్వాల్ 18 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 
 
మరోవైపు అద్భుతమైన ఫామ్‌‍లో ఉన్న యశస్వి జైస్వాల్ కేవలం 23 ఏళ్ల వయసులోపు ఒక సిరీస్‌లో 600లకు పైగా పరుగులు సాధించిన రెండో భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. డాన్ బ్రాడ్మాన్, గ్యారీ సోబర్స్, గ్రేమ్ స్మిత్, సునీల్ గవాస్కర్ వంటి ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. కాగా జులై 2023లో వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌లో జైస్వాల్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో 171 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భయంకరమైన ఫామ్‌తో మైదానంలో చెలరేగిపోతున్నాడు. 
 
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ చారిత్రాత్మక 434 పరుగుల తేడాతో గెలుపులో జైస్వాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసి ఔటయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు