ఆటగాళ్లూ.. లేట్ నైట్ పార్టీలను కట్టిపెట్టండి: బీసీసీఐ
PTI
టీం ఇండియా ఆటగాళ్లు రాత్రి పొద్దుపోయేదాకా పార్టీలలో గడిపే పద్ధతికి స్వస్తి చెప్పాలని భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) సూచించింది. ముఖ్యంగా వెస్టిండీస్లో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ ట్వంటీ20 కప్ పాల్గొనే భారత జట్టు సభ్యులు లేట్నైట్ పార్టీలను కట్టిపెట్టి, బుద్ధిగా హోటల్ గదులకు చేరుకోవాలని బీసీసీఐ పేర్కొంది.
ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం వారికి కేటాయించిన హోటల్ గదులకు రాత్రిపూట 9.30 గంటలకల్లా చేరుకునేలా చూడాలని ఈ మేరకు బీసీసీఐ, టీం ఇండియా మేనేజ్మెంట్ను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆటగాళ్లు నిర్ణీత సమయానికల్లా హోటల్ గదులకు చేరుకోవటమేగాకుండా త్వరగా నిద్రపోవటం, త్వరగా నిద్రలేవటం లాంటివి అలవాటు చేసుకోవాలని ఈ మేరకు బీసీసీఐ సూచించింది.
నిషేధిత ఐపీఎల్ కమీషనర్ లలిత్ మోడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో క్రికెట్కు ఎంటర్టైన్మెంట్ను జోడించటంతో.. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు లేట్నైట్ పార్టీలకు బాగా అలవాటు పడిపోయారని బీసీసీఐ ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇలా లేట్నైట్ పార్టీలకు అలవాటుపడిన ఆటగాళ్ల సామర్థ్యం స్థాయిపై కూడా అవి, ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.