అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

సెల్వి

శనివారం, 5 జులై 2025 (19:46 IST)
తెలంగాణ నారాయణపేటలో దారుణం జరిగింది. అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను మట్టుపెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య. నారయణపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు. 
 
అయితే అక్కడ పనిచేసే ఓ యువకుడితో రాధకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబధానికి దారి తీసింది. దీంతో ఈ విషయం రాధ భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. ఇదే విషయంలో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే 2025 జూన్ 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. 
 
తాగిన మైకంలో భర్త పడుకొని ఉండగా భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఆపై భర్త మద్యం మత్తులో చనిపోయాడని డ్రామా చేసింది. అయితే అంజిలప్ప మృతిపై అతని సోదరుడు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నారాయణపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో రాధ నిందితురాలని తేలింది. నేరం అంగీకరించడంతో రాధను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు