ఐపీఎల్ లలిత్ మోడీ బ్రెయిన్ చైల్డ్: శిల్పాశెట్టి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ లలిత్ మోడీకి, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అండగా నిలిచారు. ఐపీఎల్‌లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న లలిత్ మోడీది చిన్న పిల్లల మనస్తత్వమని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన లలిత్ మోడీ.. ఇంతటి స్థాయిలో అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెపుతున్నారు.

లలిత్ మోడీ పదవికి రాజీనామా చేయాలనే వస్తున్న వార్తలపై శిల్పాశెట్టి మాట్లాడుతూ.. ఐపీఎల్ ఛైర్మన్ పదవికి లలిత్ మోడీ వైదొలగాల్సిన అవసరమే లేదన్నారు. లలిత్ మోడీ నైపుణ్యంతోనే ఐపీఎల్ మెగా ఈవెంట్‌గా ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఐపీఎల్‌కు ఇంతటి ప్రజాదరణ రావడానికి లలిత్ మోడీనే ప్రధాన కారణమన్నారు.

ప్రపంచ క్రీడాభిమానులను ఐపీఎల్ క్రీడతో తనవైపు తిప్పుకున్న లలిత్ మోడీ మహా మేధావని శిల్పా కొనియాడింది. ఐపీఎల్ క్రీడ ఆయన బ్రెయిన్ చైల్డ్ అనీ పేర్కొంది. మోడీపై వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించబడేవరకూ వాటిని తాను నమ్మబోనని చెప్పింది.

ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఐపీఎల్ క్రీడలో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లలిత్ మోడీ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదనీ, ఈ నెల 26వ తేదీన బీసీసీఐ గవర్నింగ్ బాడీ ఎదుట అసలు నిజాలను బయట పెడతానని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి