ఐసీసీ వార్మప్ మ్యాచ్: పాకిస్థాన్ అనూహ్య ఓటమి!

FILE
ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ అనూహ్య ఓటమిని నమోదు చేసుకుంది. కరేబియన్ గడ్డపై శుక్రవారం (ఏప్రిల్-30)వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20 మెగా ఈవెంట్‌లో భాగంగా.. గురువారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే విజయం సాధించింది. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే, 12 పరుగుల తేడాతో పాక్‌పై నెగ్గింది.

సెయింట్ లూసియాలో గురువారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఎల్డన్ చిగుంబర జట్టును ఆదుకున్నాడు. 35 బంతుల్లో 49 పరుగులు సాధించిన చిగుంబర.. జింబాబ్వే జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

అనంతరం జింబాబ్వే నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆటగాళ్లలో, ఓపెనర్ కమ్రాన్ అక్మల్ 27 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 37 పరుగులు సాధించి పెవిలియన్ ముఖం పట్టాడు. కానీ పాకిస్థాన్ ప్రారంభంలోనే బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరుకోవడంతో పాకిస్థాన్ తడబడింది. ఫలితంగా కమ్రాన్ వికెట్ సమర్పించుకున్న సమయానికి పాకిస్థాన్, పది ఓవర్లలో 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత ఆలమ్, మిస్బావుల్ హక్‌ల భాగస్వామ్యంతో 7.4 ఓవర్లలో పాకిస్థాన్ 51 పరుగులు సాధించారు. అయితే ఉత్సేయ బౌలింగ్‌లో మూడు పరుగుల తేడాలో పెవిలియన్ దారి పట్టారు. దీంతో జింబాబ్వే బౌలర్ ఉత్సేయ 15 పరుగులిచ్చి, ఏకంగా నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే చేతిలో ఐసీసీ ట్వంటీ-20 ఛాంపియన్ పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

ఇకపోతే... పాకిస్థాన్ బౌలర్లలో కెప్టెన్ షాహిద్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్ సమీ ఒక్క వికెట్‌ను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే జింబాబ్వే బౌలర్లలో ఉత్సేయ నాలుగు వికెట్లు సాధించగా, చిగుంబర మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంకా పొఫు రెండు, ప్రిన్స్ ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి