క్రికెట్ లెజండ్స్ కృషి చేయాలి: యూనిస్

గురువారం, 12 మార్చి 2009 (15:30 IST)
పాకిస్థాన్‌లో క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్‌.. దేశ క్రికెట్ మాజీ లెజండ్స్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. దేశంలో క్రికెట్‌ను కాపాడుకునేందుకు మాజీ క్రికెట్ ఉద్ధండులు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాలతో సంప్రదింపులు జరపి, స్వదేశంలో పర్యటించేలా కృషి చేయాలని ఆయన కోరారు.

దీనిపై ఆయన గురువారం ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఇది ప్రతిఒక్కరి ఉమ్మడి బాధ్యత అని యూనిస్ అభిప్రాయపడ్డారు. మన దేశానికి చెందిన క్రికెట్ ఉద్ధండులు, దౌత్యవేత్తలు కలిసి కట్టుగా దేశం కోసం, క్రికెట్ మనుగడ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశీయంగా క్రికెట్ మనగడను పూర్వస్థితికి తీసుకుని వచ్చేందుకు అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమన్నారు. అయితే, ఇది ఎంతో క్లిష్టతరం. ప్రతిఒక్కరు చేయిచేయి కలిపి కృషి చేసినట్టయితే ఇది సాధ్యమవుతుందన్నారు. పాక్‌లో పర్యటించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిరాకరించడం పట్ల యూనిస్ స్పందిస్తూ.. భారత్ రాకుంటే, తామే ఆ దేశంలో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు.

వెబ్దునియా పై చదవండి