పాకిస్థాన్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయించినట్టు సమాచారం. భద్రత దృష్ట్యా పాక్ నుంచి శ్రీలంకలో వచ్చే సెప్టెంబరులో టోర్నీని నిర్వహించాలని భావించారు. అయితే, ఈ మాసంలో శ్రీలంకలో కురిసే భారీ వర్షాల కారణంగా మ్యాచ్లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఐసిసి భావిస్తోంది. అందువల్ల వేదికను దక్షిణాఫ్రికాకు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించింది. కిందటి ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన ఈ టోర్నీని భద్రత కారణాలతో ఏడాది పాటు వాయిదా వేశారు.
పాక్లో పరిస్థితి మెరుగుపడక పోవడంతో దాన్ని శ్రీలంకలో నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. అయితే సెప్టెంబర్లో లంకలో వర్షాలు అధికంగా కురుస్తాయని, ఈ నేపథ్యంలో అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే మ్యాచ్లు సజావుగా సాగడం కష్టమని ఐసిసి ఎగ్జిక్యూటివ్ కమిటి అనుమానం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించడమే సబబని సూచించింది. దీనిపై ఈ నెల 16న జరిగే ఐసిసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
అలాగే, మినీ ప్రపంచ కప్గా భావించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా జట్టు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. రెండేళ్ళ క్రితం ఐసిసి ప్రపంచ ట్వంటీ-20 టోర్నీని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమర్థవతంగా నిర్వహించి, మంచి మార్కులు కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
ఎనిమిది దేశాలు పాల్గొనే 12 రోజుల ఈవెంట్కు ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, 2010 ఐసిసి ప్రపంచ ట్వంటీ-20 కప్కు కరేబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తాయి. ఈ టోర్నీ వచ్చే యేడాది ఏప్రిల్ 30 నుంచి మే 16వ తేదీల మధ్య జరుగుతాయి. 2009 టోర్నమెంట్కు ఇంగ్లండ్ జూన్ ఐదు నుంచి 21వ తేదీల మధ్య ఆతిథ్యం ఇవ్వనుంది.