ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రచారాన్ని ప్రముఖ బాలివుడ్ నటి, ఆ ఫ్రాంచైజీకో-ఓనర్ శిల్పా షెట్టి శనివారం ప్రారంభించారు. రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీని విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ జైపూర్లో జరగవలసిన మ్యాచ్ లను ముంబాయికి మార్చినందుకు విచారం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ టోర్నీ లీగ్ పోటీలను రాజస్థాన్ నుంచి ముంబాయికి మార్చడం తనకు చాలా బాధ కలిగిస్తోందని శిల్పాశెట్టి అన్నారు. తాను ఆశావాదిగానే మాట్లాడుతున్నాననీ... టెర్రరిజానికి భయపడి వెన్నుచూపే బదులు, దాన్ని అందరూ ధైర్యంగా ఎదిరించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
క్రీడారంగం అత్యంత స్ఫూర్తిదాయకమైనదని చెప్పిన శిల్ప... ఐపీఎల్కు ఈ క్షణంలో కావలసిందల్లా కట్టుదిట్టమైన భద్రతేనని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ల సక్రమ నిర్వహణకు అప్రమత్తమైన భద్రతా ఏర్పాట్లు ఎంతైనా అవసరమని మీడియాకు పేర్కొన్నారు.