షోయబ్ మాలిక్‌కు పీసీబీ "పెళ్లి కానుక" ఏంటో తెలుసా..!?

PTI
వివాదాల ఉచ్చులో బిగుసుకుపోయిన పాకిస్థాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధించిన ఏడాది కాలంపాటు నిషేధాన్ని ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడేందుకు హైదరాబాద్ వచ్చిన షోయబ్‌కు పాకిస్థాన్ క్రికెటర్లు, నటులు "మేమున్నామంటూ.. మద్దతు పలకడంతో షోయబ్ మాలిక్ చాలా సంతోషంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షోయబ్ మాలిక్‌పై విధించిన ఏడాది పాటు నిషేధాన్ని కూడా త్వరలో ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ పత్రికల ద్వారా తెలిసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ఆటతీరును ప్రదర్శించిన షోయబ్ మాలిక్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే.. సానియా మీర్జాతో ఈ నెల 15వ తేదీన పెళ్లి జరిగి తీరుతుందని షోయబ్ మాలిక్ తనకు కాబోయే భాగస్వామి సానియా మీర్జాతో కలిసి సోమవారం మీడియా ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్‌కు పెళ్లికానుకగా పీసీబీ నిషేధం ఎత్తివేయనుంది.

మరోవైపు.. షోయబ్ మాలిక్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ.. అయేషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయేషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం షోయబ్‌తో విచారణ జరిపారు. అనంతరం అయేషా సహా ఆమె కుటుంబ సభ్యులతో విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

ఇంకా షోయబ్ మాలిక్ అయేషాను దుబాయ్‌లో కలిశాడా? అయేషా ఇంటి విందుకు జట్టు సభ్యులతో కలిసి వెళ్లడం నిజమేనా? ఫోనులో జరిగిన నిఖాకు సాక్షులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పైగా అయేషా పోలీసులకు అందించిన షోయబ్‌తో కలిసి తీయించుకున్న ఫోటోలు, సీడీలపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి