సిరీస్ విజయంపైనే టీం ఇండియా గురి

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయానికి టీం ఇండియా తహతహలాడుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు జరిగినప్పటికీ, రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో బుధవారం జరిగే నాలుగో వన్డేలోనూ విజయపరంపరను కొనసాగించి సిరీస్‌లో 3-0 ఆధిక్యత సాధించడంపై భారత్ గురి పెట్టింది.

ఫామ్‌లో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హామిల్టన్‌లో జరిగే ఈ నాలుగో వన్డేకు పొత్తికడుపు గాయం కారణంగా దూరమయ్యాడు. సచిన్ అందుబాటులో లేనప్పటికీ ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌లో 3-0 ఆధిక్యత సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇదే జరిగితే ఆతిథ్య దేశంలో వన్డే సిరీస్ భారత్ కైవశం కానుంది.

ఇదిలా ఉంటే... సిరీస్‌ చేజారిపోకుండా ఉండేందుకు నాలుగో వన్డేలో తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్థితిని కివీస్ జట్టు ఎదుర్కొంటోంది. పర్యటన ప్రారంభంలో జరిగిన ట్వంటీ- 20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన టీం ఇండియా, ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో అనూహ్యంగా పుంజుకుంది.

కాగా... తొలి, మూడో వన్డే మ్యాచ్‌ల విజయంతో టీం ఇండియా సిరీస్‌లో ఆధిపత్యం కివీస్ సిరీస్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతున్న టీం ఇండియాకు కళ్లెం వేసేందుకు నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించాల్సి ఉంది. నాలుగో వన్డే హామిల్టన్‌లోని సెడన్ పార్కులో బుధవారం జరగనుంది.

వెబ్దునియా పై చదవండి