3-0 ఆధిక్యంతో సిరీస్ భారత్ కైవసం

FileFILE
హామిల్టన్‌లో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొందడంతో... భారత్ 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం మళ్లీ అడ్డంకిగా నిలవడంతో డెక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఆశ్రయించక తప్పలేదు. ఈ పద్ధతి ప్రకారం 23.3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 177 పరుగులు చేయగా.. భారత్ 201 పరుగు చేసింది.

దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందినట్లుగా ప్రకటించారు. అంతకుముందు... న్యూజిలాండ్ 270 పరుగులను చేసి భారత్‌కు సవాలు విసిరింది. అయితే వర్షం అడ్డంకిగా నిలవడంతో లక్ష్యాన్ని కుదించారు. విజయలక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు న్యూజిలాండ్ బౌలర్ల భరతం పట్టారు.

సెహ్వాగ్ 125 పరుగులు, గంభీర్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వర్షం మళ్లీ మొదలైంది. అప్పటికి భారత్ మొత్తం 13 ఎక్స్‌ట్రాలతో కలిపి 201 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు ధాటిగా ఆడటంతో ఓవర్‌కు 8.55 రన్‌రేట్ ఏమాత్రం తగ్గకుండా వచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో చెలరేగిన సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అలాగే సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లో సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో గతంలో అజారుద్దీన్ పేరిట ఉన్న 62 బంతుల్లో వంద పరుగులు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

వెబ్దునియా పై చదవండి