నాలుగో వన్డే: భారత్ విజయ లక్ష్యం 281

హామిల్టన్‌లో భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో మెక్‌కలమ్ (77), మెక్ గ్లాషన్ (56 నాటౌట్)లు రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 270 పరుగులు సాధించింది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత విజయ లక్ష్యాన్ని 281గా అంపైర్లు నిర్ణయించారు.

భారత్ తరపున ఇషాంత్‌శర్మ రెండు వికెట్లు సాధించగా జహీర్‌ఖాన్, యువరాజ్‌సింగ్, యూసఫ్ పఠాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలో దిగిన రైడర్, మెక్‌కలమ్‌లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరి భాగస్వామ్యంలో న్యూజిలాండ్ జట్టు 102 పరుగులు సాధించింది.

ఈ దశలో యువరాజ్ బౌలింగ్‌లో రైనా పట్టిన క్యాచ్‌తో రైడర్ (46) నిష్క్రమించాడు. అటుపై క్రీజులోకి వచ్చిన టైలర్ (5) తక్కువ పరుగులకే జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్‌పై భారత్ కాస్త పట్టు సాధించింది.

అనంతరం అర్థ సెంచరీ పూర్తి చేసుకుని ఊపుపై ఉన్న మెక్‌కలమ్ (77) సైతం యూసఫ్ పఠాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీని తర్వాత ఓరమ్ (1) ఇషాంత్ బౌలింగ్‌లో నిష్క్రమించగా, గుప్టిల్ (25) సైతం ఇషాంత్ బౌలింగ్‌లో క్రీజును వదిలాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంఫైర్లు మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు.

వెబ్దునియా పై చదవండి