ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా.. బుధవారం రాజస్థాన్ రాయల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య సమరం జరుగనుంది. ఐపీఎల్ పట్టికలో పది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇప్పటికే వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటా జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. సెమీఫైనల్ ఆశలను చేతులారా పోగొట్టుకున్న పంజాబ్, ప్రతీ మ్యాచ్లో నెగ్గాలనే ఉద్దేశంతో తలపడుతోంది.
ఇందులో భాగంగా ఆదివారం జరిగిన 34వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో గంగూలీ సేనను మట్టికరిపించింది. ఇదే ఊపుతో శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు షేన్ వార్న్ సేన రాజస్థాన్ రాయల్స్ను ఓడించాలని పంజాబ్ భావిస్తోంది.
అయితే ఐపీఎల్ 36వ లీగ్ మ్యాచ్లో హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్పై థ్రిల్ విజయాన్ని నమోదు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇంకా షేన్ వాట్సన్ బ్యాటింగ్ రాజస్థాన్కు ప్రత్యేక బలమని వారు చెబుతున్నారు. దీనిని బట్టి రాజస్థాన్ రాయల్స్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట..!.