టెస్ట్ల్లో భారత్ జట్టు అగ్రస్థానం అటకెక్కినట్లేనా ?
మంగళవారం, 2 ఆగస్టు 2011 (19:38 IST)
FILE
చరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకోకపోవడమే చరిత్ర నుంచి మనం నేర్చుకున్నదనే విషయం టీమిండియా ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. మొన్న ప్రపంచకప్ను కైవసం చేసుకున్నప్పుడు చూపించిన ఆటతీరును టెస్టుల్లోకి వచ్చేసరికి జావగారిపోయింది. టెస్ట్ జట్టును ఏడాదిన్నర పాటు నెంబర్వన్ స్థానంలో నిలిపిన మహేంద్ర సింగ్ ధోనికి తన జట్టు సామర్థ్యం ఏమిటో తెలిసొచ్చింది. ఇక ఇప్పుడే అసలైన పని ప్రారంభమైందని ధోనీకి బాగా అర్థమై ఉంటుంది. అగ్రస్థానాన్ని చేరిన ప్రతి విజేతలాగానే తనకు కూడా ఆ స్థానాన్ని చేరడం కంటే నిలుపుకోవడమే కష్టమని తెలిసి ఉంటుంది.
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీరో క్రీడల మానసిక నిపుణులు కానవసరం లేదు. ఒక అగ్ర జట్టు తన ఆటతీరును మెరుగుపర్చుకోలేదంటే ఇతర జట్లు ఆ జట్టును దాటి వెళ్తాయి. ఏ అగ్ర జట్టుకైనా లేదా ఉన్నతస్థాయి సంస్థకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రతిరోజు మెరుగుపర్చుకుంటూనే ఉండాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పటికీ ఆగిపోదు. ఆగిపోకూడదు.
ఇంగ్లాండ్ చేతిలో భారత జట్టు రెండు దారుణమైన ఓటములు చవిచూసింది. ఒకటి 196 పరుగుల తేడాతో మరొకటి 319 పరుగుల భారీ అంతరంతో. ఇది చాలు టెస్టుల్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగే హక్కు లేదనడానికి. ఇంగ్లాండ్లో వెంట వెంటనే ఓటములతో భారత్ అగ్రస్థానంపై సందేహాలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్ అగ్రస్థానానికి అర్హం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు సంవత్సరాలుగా ఇంగ్లాండ్ ఆడుతున్న తీరును చూసినవారికి ఇది ఆశ్చర్యం కలిగించదు.
భారత జట్టు ఓటమికి కారణాలు ఒకసారి పరిశీలిస్తే:
సన్నాహ లోపం:
ఇంగ్లాండ్లో సవాళ్లను ఎదుర్కొనే జట్టుగా భారత్ కనిపించలేదు. సరైన ప్రణాళిక లేదు. ఐపీఎల్లో ఆడిన అనుభవం భారత్కు టెస్ట్ల్లో ఉపయోగపడదు. టెస్ట్ మ్యాచ్లో కీలకమైన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్ట లేదు.
బ్యాట్స్మెన్ ఫామ్:
ఇండియా చాలా కాలంగా బ్యాటింగ్పైనే ఆధారపడుతూ వస్తున్నది. దురదుష్టవశాత్తు తొలి రెండు టెస్ట్ల్లో బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఎప్పుడూ లేని విధంగా భారత జట్టు ఇంగ్లాండ్ గత నాలుగు ఇన్నింగ్స్ల్లో 300 పరుగుల లోపే ఆలౌట్ అయింది. రాహుల్ ద్రవిడ్ను తప్పిస్తే లక్ష్మణ్, సచిన్ కొంతమేర ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్మెన్ అంతా ఇంగ్లాండ్ పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. షార్ట్ పిచ్ బంతులకు సురేష్ రైనా, యువరాజ్ సింగ్, అభినవ్ ముకుంద్ ఔట్ అయిన తీరు సిగ్గుచేటు.
ఆకట్టుకోని హర్భజన్:
నెం.1 జట్టుగా ఉండాలంటే నాణ్యమైన స్పిన్నర్ కూడా అవసరం. ఇంగ్లాండ్పై హర్భజన్ సింగ్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతడి బౌలింగ్ చాలా సాధారణంగా ఉంది. వికెట్ నుంచి టర్న్, బౌన్స్ రాబట్టుకోవడంలో విఫలమయ్యాడు. జహీర్ ఖాన్ గైర్హాజరీలో ఈ పంజాబీ స్పిన్నర్పై అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే భజ్జీ పూర్తిగా నిరాశపరుస్తూ తొలి రెండు టెస్ట్ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
గాయాల బెడద:
ప్రపంచ కప్ ముగిసిన వెంటనే సిరులు కురిపించే ఐపీఎల్ జరిగింది. చాలావరకు టాప్ ఆటగాళ్లందరూ ఇందులో పాల్గొన్నారు. ఫలితం చూశారుగా.. టీమిండియాకు వెన్నెముక అయిన సెహ్వాగ్, గంభీర్, జహీర్లు గాయపడ్డారు. గాయాలతో ధోని ప్రణాళికలన్నీ విఫలమయ్యాయి.
ధోనీ ఫామ్:
ఫామ్లో లేని సారథి జట్టుకు ప్రేరణ కలిగించలేడు. రెండు టెస్ట్ల్లో ధోని బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ మాట్ ప్రియర్ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అదరగొట్టాడు.
ప్రధాన ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం:
కొంతమంది మీదే ఆధారపడేవి ఉత్తమ జట్లు కాదు. స్టార్లు వస్తుంటారు పోతుంటారు. కానీ జట్టు విజయాలు సాధించడమే అలవాటుగా మారాలి. కీలక ఆటగాళ్లు లేకపోయినా జట్టు గెలిచేలా రిజర్వ్ బెంచ్ను సిద్ధంగా ఉంచుకోవాలి.
పోరాట స్ఫూర్తి లేకపోవడం:
భారత ఆటగాళ్లకు పోరాట స్ఫూర్తి తక్కువ. లార్డ్స్ టెస్ట్ రెండో టెస్ట్లో ఇంగ్లాండ్ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత వారి పోరాడిన తీరు అభినందనీయం.
ప్రాధాన్యతలు:
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ చెప్పినట్లు ఐపీఎల్ కారణంగా భారత జట్టు శారీరకంగా, మానసికంగా అలసిపోయింది. భారత జట్టు ట్వంటీ-20కి ఇచ్చిన ప్రాధాన్యత టెస్ట్లకు ఇవ్వడం లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకెల్ క్లార్క్, మిఛెల్ జాన్సల్ టెస్ట్లపై దృష్టి సారించడానికి ఆ దేశ టీ-20 టోర్నీ అయిన బిగ్బాగ్కు దూరంగా ఉన్నారు.
ధోనీ, జహీర్, సెహ్వాగ్, గంభీర్తో పాటు భారత క్రికెట్ దేవుడు సచిన్ ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? గాయంతోనే ఐపీఎల్ సెమీ ఫైనల్లో గంభీర్ ఎందుకు ఆడాడు ? భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి సెహ్వాగ్ ఎక్కువ కాలం ఎందుకు వేచిచూశాడు? ఈ పతనానికి ఎవరిని బలిచేస్తారు?
చివరిగా వీటన్నింటికీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) వద్ద సమాధానాలున్నాయా? ఉంటే ఎలా సరిచేస్తుందో... మిగిలిన రెండు టెస్టు మ్యాచ్ల కైవసానికి ఎటువంటి వ్యూహం రూపొందిస్తుందో చూడాలి.