'జీన్స్' తిరగబడింది, కట్ చేస్తే పోలీసులు వెంబడిస్తున్నారు

శనివారం, 14 ఆగస్టు 2021 (20:52 IST)
జీన్స్. అప్పట్లో ఐశ్వర్యారాయ్, ప్రశాంత్ నటించిన చిత్రం సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో ప్రశాంత్ డబుల్ రోల్. కవల పిల్లలు. వారికి కూడా కవల సోదరీమణులతో పెళ్లి చేస్తానని పట్టుబడతాడు హీరోల తండ్రి. దాంతో ఐశ్వర్యారాయ్‌తో ఆమె బామ్మ ఇద్దరిలా నాటకమాడిస్తుంది. చివరికి దొరికిపోతుంది ఐష్. ఇప్పుడీ స్టోరీ ఎందుకంటే... అచ్చం అలాగే ఓ యువకుడు ఓ యువతిని మోసం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై ఆరుంబాకానికి చెందిన రెయాన్ అనే యువకుడు 21 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఆమె తన తల్లిదండ్రులను అతి కష్టమ్మీద పెళ్లికి ఒప్పించింది. దాంతో అమ్మాయి తరపువారు కట్నంగా మూడున్నర లక్షల నగదుతో పాటు బంగారం కూడా పెట్టేందుకు అంగీకరించారు.
 
ఈలోపు అమ్మాయి తరపు బంధువులు రెయాన్ గురించి ఆరా తీసారు. దీనితో ఇతగాడికి ఆల్రెడీ పెళ్లయిందనీ, పిల్లలు కూడా వున్నారని తేలింది. దీనితో యువతి నిలదీసింది. రెయాన్ ఇలాంటి సమస్య వస్తుందని తెలుసు కనుక నకిలీ ఆధార్, పాస్ పోర్టు వగైరాలు సృష్టించేసి, తనకు సోదరుడు వున్నాడనీ, ఇద్దరం కవలలం అనీ అతడు దుబాయిలో వున్నాడని నమ్మించే ప్రయత్నం చేసాడు.
 
ఐతే మరింత లోతుగా అమ్మాయి తరపు బంధువులు పరిశీలన చేయడంతో రెయాన్ దొరికిపోయాడు. దీనితో సదరు యువతి నిలదీసి తీసుకున్న నగదు వెనక్కి ఇచ్చేసి నీ ముఖం నాకు చూపించకు అని వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీ ముఖంపై యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించాడు రెయాన్. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడు పరారయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు