పెళ్లి ఇష్టంలేక.. కాబోయే భర్త గొంతు కోసిన వధువు

మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:07 IST)
అతనిని పెళ్లి చేసుకోవడం ఆ యువతికి ఇష్టంలేదు. ఈ విషయం తెలియని పెద్దలు వారిద్దరికీ నిశ్చితార్థం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని యువతి ఏకంగా తనకు కాబోయే భర్తనే మట్టుబెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం అతన్ని నమ్మించి సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి తన వద్దకు పిలిపించుకుంది. ఆ తర్వాత కళ్లుమూసుకోవాలని చెప్పి మెడకు చున్నీ బిగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసింది. ప్రస్తుతం ఆ యువకుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం అనకాపల్లి జిల్లా మాడుగల మండలం ఎం.కోటపాడు గ్రామంలో జరిగింది. 
 
తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతానికి చెందిన వి.పుష్పకు ఈ నెల 4న వివాహ నిశ్చితార్థం జరిగింది. మే నెలలో వివాహం జరిపించేలా పెద్దలు ముహుర్తాలు పెట్టుకున్నారు. అయితే, ఈ పెళ్లి చేసుకోవడం పుష్పకు ఇష్టం లేదు. ఎలాగానే పెళ్లిని నిలిపుదల చేయాలని భావించింది. 
 
ఈ క్రమంలో సోమవారం రామునాయుడుకు పుష్ప ఫోన్‌ చేసి, ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. కాసేపు  మాట్లాడుకున్నాక తిరుగు ప్రయాణమయ్యారు.
 
మార్గమధ్యంలో బైక్‌  ఆపాల్సిందిగా పుష్ప కోరింది. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. రామునాయుడు కళ్లు మూసుకోగా... చున్నీని అతడి మెడకు చుట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. 
 
ఆ తర్వాత రామునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, ప్రమాదం జరిగిందని, అతను గాయపడ్డాడని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. కానీ, రామునాయుడు మాత్రం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. రామునాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి, చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు