వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

ఐవీఆర్

శనివారం, 7 జూన్ 2025 (18:47 IST)
అర్థరాత్రి 11.30 నిమిషాలకు ఓ వ్యక్తి రక్తం మరకలు వున్న చొక్కాతో స్కూటర్ పైన బెంగళూరు శివారులోని చందపుర రోడ్డుపై వేగంగా వెళ్తున్నాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతడిని గమనించారు. వెంటనే అతడి వెనుకనే పోలీసు వాహనాన్ని నడిపి అడ్డుకున్నారు. చొక్కాపై రక్తపు మరకలు ఏంటి అని అతడి వంక చూస్తుండగానే స్కూటర్ కాళ్లు పెట్టుకునే ముందుభాగంలో ఓ మహిళ తల భాగం కనబడింది. దాంతో పోలీసులు షాక్ తిన్నారు. కానీ హంతకుడు మాత్రం తాపీగా స్కూటర్ స్టాండ్ వేసి పోలీసులకు జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. దీనితో అతడిపై శుక్రవారం అర్థరాత్రి గం. 1.30 నిమిషాలకు కేసు నమోదు చేసారు.
 
కేసు వివరాలను పోలీసులు వివరిస్తూ... హంతకుడు 26 ఏళ్ల శంకర్‌కి 25 ఏళ్ల మానసను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా వుంది. బెంగళూరు లోని హీలాలిగెలో ఇద్దరూ నివాసం వుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. శంకర్ కోరమంగళలో పనిచేస్తుండగా మానస బొమ్మసంద్రలో పనికి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో తన భార్య మానస ఆమె పనిచేసే కంపెనీలో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు తెలుసుకున్నాడు. దాంతో ఆమెను నిలదీశాడు. తనకంటే నీకు ప్రియుడే కావలసి వస్తే అతడి వద్దకే వెళ్లిపో అంటూ ఆమెకి వార్నింగ్ ఇచ్చాడు.
 
ఇదే అదనుగా మానస అన్నీ సర్దుకుని ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఐతే ఆమె అలా తన ఇంటికి రావడంతో అప్పటివరకూ అద్దె ఇంట్లో వుంటూ అవకాశం వచ్చినప్పుడలా ఆమెతో రాసలీల సాగించే ప్రియుడు విషయం తెలుసుకుని భయపడిపోయాడు. తెల్లారేసరికి చెప్పాపెట్టకుండా ఆమెకి కనిపించకుండా పారిపోయాడు. దీనితో దిక్కుతోచని మానస మళ్లీ భర్త వద్దకు వచ్చింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకుని తిరిగి భర్తతో కాపురం చేస్తోంది.
 
ఐతే శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ వివాహేతర సంబంధం గురించి వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇంట్లో వున్న గొడ్డలితో భార్య తలను నరికేసాడు శంకర్. ఆ తర్వాత ఆమె మొండేన్ని సమీపంలో పొదల్లో వేసి తలను తీసుకుని స్కూటర్ ఫుట్ బోర్డుపై పెట్టుకుని బయలుదేరాడు'' అంటూ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు