మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

ఠాగూర్

సోమవారం, 16 జూన్ 2025 (16:44 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మోడల్ గొంతుకోసి హత్య చేసిన దుండగులు.. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలోపడేశారు. సోనిపట్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
 
స్థానికంగా ఉండే ఓ మ్యూజిక్ కంపెనీలో మోడల్‌గా శీతల్ అనే యువతి పని చేస్తుంది. ఆమె కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా సోనిపట్‌లోని కుండా గ్రామ సమీపంలోని ఓ నీటి కాలువలో మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో శీతల్‌ను గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసినట్టు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, శీతల్‌ను హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
అలాగే, పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి (30) కూడా ఇలాగే హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బఠిండా జిల్లాలోని ఆదేశ్ వర్శిటీ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసివున్న కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు