ఆడబిడ్డ భర్తతో మాట్లాడినా అనుమానమే, నా భర్త రాక్షసుడు: సూసైడ్ చేసుకున్న గర్భిణి

గురువారం, 4 ఆగస్టు 2022 (12:59 IST)
హైదరాబాద్ బాలాపూర్ పోలీసు స్టేషను పరిధిలో దారుణం జరిగింది. భర్త మానసిక, భౌతిక దాడులు తాళలేక 3 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకి కారణం తన భర్తే అనీ, అతడు తన శవాన్ని తాకడానికి కూడా అర్హుడు కాడని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

 
పోలీసులు వెల్లడించిన వివరాలు చూస్తే... షాహిన్ నగర్ జుబైద్ కాలనీలో వుండే 29 ఏళ్ల ఫిర్దోస్ అన్సారీతో చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన 30 ఏళ్ల సుల్తాన్ పటేల్‌కి 2021 ఫిబ్రరిలో వివాహం జరిగింది. ఫిర్దోస్ ఎంబీఏ పూర్తి చేసారు. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు పటేల్. ఎవరితో మాట్లాడినా అనుమానం వ్యక్తం చేసేవాడు. ఆఖరికి తన ఆడబిడ్డ భర్త, వారి పిల్లలతో మాట్లాడినా అనుమానం వ్యక్తం చేస్తూ బెల్టు తీసుకుని చితకబాదేవాడు.

 
తన వేధింపులు గురించి ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపుతానంటూ బెదిరించేవాడు. తను దాడి చేసినట్లు చెబితే తనతో ఏకాంతంగా గడిపిన వీడియో దృశ్యాలను బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. ఆమెకి రెండుసార్లు అబార్షన్ అయితే ఆనందించాడు. ప్రస్తుతం తను 3 నెలల గర్భవతి. తన భర్త రాక్షసత్వాన్ని తట్టుకోలేక పుట్టింటివారికి చెప్పినా సర్దుకుపోవాలని సూచించారు.

 
ఐతే భర్త వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసి ఇంట్లో తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త పరారీలో వున్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు