ఇన్స్టాలో ప్రారంభమైన ప్రేమ చివరకు దారుణ హత్యతో ముగిసింది. ప్రియురాలిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మూటగట్టి బ్యాగులో పెట్టుకున్నాడు. దారిలో ఆ బ్యాగుకో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ తప్పుతో పోలీసులకు చిక్కిపోయాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కాన్పూర్కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్, ఆకాంక్ష (20)లకు ఇన్స్టాల్ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతోందని సూరజ్ అనుమానించసాగాడు. ఈ విషయమై జులై 21న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన సూరజ్, ఆమె తలను గోడకేసి కొట్టి, ఆపై గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత, నేరాన్ని కప్పిపుచ్చేందుకు సూరజ్ తన స్నేహితుడైన ఆశిష్ కుమార్ సహాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఓ పెద్ద బ్యాగులో కుక్కి, దాన్ని పారేయడానికి బైకుపై 100 కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరారు. యమునా నదిలో ఆ బ్యాగను పడేయాలనేది వారి ప్రణాళిక. అయితే, మార్గమధ్యంలో సూరజ్ ఆ బ్యాగుతో ఒక సెల్ఫీ కూడా తీసుకుని తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు.
ఈ క్రమంలో ఆగస్టు 8న ఆకాంక్ష కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సూరజ్ను, అతని స్నేహితుడిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట బుకాయించినా, ఫోన్ సంభాషణల ఆధారాలు చూపడంతో సూరజ్ నేరాన్ని అంగీకరించాడు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సూరజ్ పోలీసులకు తెలిపాడు. తొలుత తన సోదరితో కలిసి బర్రా ప్రాంతంలో నివసించిన ఆకాంక్ష, తర్వాత సూరజ్ కలిసి హనుమంత్ విహార్లో అద్దె ఇంట్లో ఉండటం ప్రారంభించింది. తాను తీసుకున్న సెల్ఫీ గురించి కూడా సూరజ్ పోలీసులకు చెప్పడంతో, అతని ఫోన్ నుంచి ఆ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.