ఎన్టీఆర్ జిల్లాలో దారుణం : బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం

ఆదివారం, 13 ఆగస్టు 2023 (15:49 IST)
ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం జరిగింది. బాలికను ఓ వ్యక్తి బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చందర్లపాడు మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చందర్లపాడు మండంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఇటుకబట్టీల పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. 
 
వారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి వస్తుంటారు. ఈ సమయంలో బాలికపై అదే గ్రామానికి చెందిన మాణిక్యాల రావు కన్నేశాడు. ఓ రోజున ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. మాణిక్యాల రావుపై ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
బాలిక ఎదుట అసభ్యకర చేష్టలు..  
 
అమెరికా పోలీసులు ఓ భారతీయ వైద్యుడిని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలకు పాల్పడటంతో యూఎస్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అతని పేరు సుదీప్త మొహంతి (33). ఈయన్ను గురువారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఫెడరల్‌ న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కొన్ని ఆంక్షలు విధిస్తూ విడుదల చేశారు. 
 
ఇంటర్నల్‌ మెడిసిన్‌, ప్రైమరీ కేర్‌ వైద్యుడైన మొహంతి గతేడాది మే నెలలో తన స్నేహితురాలితో కలిసి హోనోలులు నుంచి బోస్టన్‌ వస్తున్నారు. అదే విమానంలో 14 ఏళ్ల బాలిక తన తాత, మామ్మలతో కలిసి ప్రయాణించింది. మొహంతి పక్క సీటులో కూర్చుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. మొహంతి అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్న సంగతిని గమనించిన ఆమె వెంటనే వేరే లైనులోని ఖాళీ సీటులోకి వెళ్లిపోయింది. 
 
విమానం బోస్టన్‌లో దిగిన తర్వాత తాత మామ్మలతోపాటు విమానయాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు మొహంతిపై కేసు నమోదు చేశారు. విమాన ప్రయాణంలో అసభ్యకర చర్యలకు పాల్పడితే అమెరికా చట్టాల ప్రకారం 90 రోజుల జైలు శిక్ష, ఏడాదిపాటు పర్యవేక్షణతో కూడిన విడుదల, సుమారు రూ.4.15 లక్షల జరిమానా విధిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు