ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడి తాగుబోతు భర్తను కట్టుకున్న భార్య హత్య చేసింది. భర్తను చంపి, సహజమరణంగా చిత్రీకరించేందుకు ఆమె వేసిన ప్లాన్ వికటించింది. దీంతో ఆమె ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ హుస్సేన్ (44) కనగల్ మండల పరిధిలోని చర్లగౌరారంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. 2007లో ఆయన అక్సర్ జహా అనే మహిళను పెళ్లాడగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఖలీల్.. నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను వేధించసాగాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకుంటే, తాను, తన పిల్లలు ప్రశాంతంగా జీవించవచ్చని భావించింది. పైగా, భర్త చేసే ప్రభుత్వ ఉద్యోగం కూడా తనకు వస్తుందని ఆశపడింది.
ఈ క్రమంలో గత నెల 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖలీల్ తలపై భార్య అక్సర్ బలమైన వస్తువుతో దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఖలీల్ మూర్ఛవచ్చి కిందపడటంతో తీవ్రంగా గాయపడగా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నామమాత్రం చికిత్స చేసి ఇంటికితీసుకొచ్చింది. అదే నెల 24వ తేదీన పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు.
తన కుమారుడు మృతిని సందేహించిన ఖలీల్ తల్లి అక్బర్ పోలీసులకు ఫిబ్రవరి 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి ఖలీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో తలకు బలమైన గాయం తగలడం వల్ల మృతి చెందినట్టు తేలింది. ఆ తర్వాత మృతుడు భార్య అక్సర్ జహాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. భర్త ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె వెల్లడించింది.