అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ - హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష!!

ఠాగూర్

సోమవారం, 10 మార్చి 2025 (15:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టంచిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. మొదటి నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులోని రెండో నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు. ఈ కేసులో మిగిలిన ఏడుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత కారాగార శిక్షలను విధించింది. 
 
కాగా, తుది తీర్పు సందర్భంగా ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. శిక్షలు తగ్గించాలని ప్రాధేయపడ్డారు. తాము పిల్లలుగలవాళ్లమని, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తనకు ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. 
 
కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీ రావు గత 2020లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. 2018లో సెప్టెంబరు 14వ తేదీన మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతి రావు బీహార్‌కు చెందిన గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిమరీ తన కుమార్తె భర్తను హత్య చేయించాడు. 
 
ఈ కేసు విచారణ నల్గొండ ఎస్సీఎస్టీ కోర్టులో సాగింది. ఈ కేసులో అమృతవర్షిణి, ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత ఇచ్చిన వాంగ్మూలం కూడా కీలకంగామారింది. నిందితుడు సుభాష్ కుమార్ శర్మను వారు గుర్తించడంతో ఈ కేసును ఛేదించడానికి ఉపయోగపడింది. ఈ కేసులో సహకరించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని న్యాయస్థానం అభినందించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు