అనుమానంతో భార్యకు చిత్రహింసలు - రెండేళ్ళ కుమారుడికి నిప్పంటించి..

ఆదివారం, 26 డిశెంబరు 2021 (19:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ వివాహిత భర్త పెట్టే వేధింపులు భరించలేక తన రెండేళ్ల కుమారుడికి నిప్పు పెట్టి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం జిల్లాలోని కొండపాక మండలం సిర్సనగండ్ర గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తికి చేర్యాల మండలం వేచరేణికి చెందిన నవిత అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మణిదీప్ అనే రెండేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. 
 
అయితే, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన స్వామికి భార్యపై అనుమానం పెరిగింది. తనను కాదని పరాయి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందన్న అనుమానం పనుభూతమైంది. దీంతో ఆమెను నిత్యం వేధించసాగాడు. 
 
ఈ విషయంపై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయితే, పుట్టింటివారితో పాటు కులపెద్దలు సర్దిచెప్పడంతో ఆమె భర్త వద్దనే ఉంటూ వచ్చింది. అప్పటికీ భర్త వేధింపులు ఏమాత్రం తగ్గలేదు కదా అతని ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు రాలేదు. 
 
అయితే, శనివారం ఉదయం భార్యను పత్తి ఏరేందుకు చేనుకు రమ్మని స్వామి కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో భార్యపై స్వామి చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె... ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం తెల్సిన నవిత తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి భర్త, ఆమె అత్త, బావలే కారణమంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు