సహజీవనం చేసిన మహిళను కాల్చి చంపిన కాంట్రాక్టరు

ఠాగూర్

ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (14:31 IST)
తనతో సహజీవనం చేసిన ఓ మహిళను కాంట్రాక్టరు కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, స్థానిక రూప్సింగ్ స్టేడియం ఎదుట అరవింద్ అనే కాంట్రాక్టరు తనతో సహజీవనం చేసిన నందిని (28)ని తుపాకితో కాల్చి చంపాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ తన ప్రాణాలకు ముప్పు ఉందని నందిని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
హత్య జరిగిన రోజు కూడా ఆమె తన ఫిర్యాదుతో ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా అరవింద్ అడ్డుకొని కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. నిందితుడు పక్కనే తుపాకీ పట్టుకొని కూర్చోవడం చూసి పాదచారులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. నిందితుడు తుపాకితో వారిని కూడా బెదిరించాడు. దీంతో బాష్పవాయువు ప్రయోగించి అతణిని అరెస్టు చేశారు. 
 
ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేసిన మాజీ ప్రియుడు 
 
ఏపీలోని నెల్లూరు నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం దారుణంగా ముగిసింది. బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన మైథిలీప్రియ అనే యువతి, తన పూర్వ ప్రియుడి చేతిలో కత్తిపోటుకుగురై మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
పోలీసుల కథనం ప్రకారం, బీఫార్మసీ పూర్తి చేసిన మైథిలీప్రియ (23), విద్యాభ్యాస సమయంలో రాపూరు మండలానికి చెందిన నిఖిల్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే, నిఖిల్ ఇటీవల మరొక యువతితో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
 
ప్రస్తుతం బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మైథిలీప్రియ, పది రోజుల క్రితం నెల్లూరుకు వచ్చింది. నిఖిల్ ఫోన్ చేసి మాట్లాడాలని పిలవడంతో, ఆమె తన చెల్లెలు ఇంట్లో ఉండగా నిఖిల్ వద్దకు వెళ్ళింది. నిఖిల్ తన గదిలో మైథిలీప్రియపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మైథిలీప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.
 
ఆ తర్వాత, నిఖిల్ మైథిలీప్రియ సోదరికి ఫోన్ చేసి, వారి మధ్య గొడవ జరగడం వల్ల కత్తితో పొడిచానని చెప్పాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు