ఇద్దరు 'చంద్రులు' జాతీయ స్థాయి స్టామినా ఎంతో?

గురువారం, 20 డిశెంబరు 2018 (19:53 IST)
గడిచిన ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాలు గురించి పదేపదే మాట్లాడుతున్నారు. బాబు బిజెపి వ్యతిరేక కూటమి అంటుంటే కేసీఆర్ మాత్రం ప్రాంతీయ పార్టీల కూటమి అంటున్నారు. అందుకు సంబంధించిన కారణాలను కూడా చెపుతున్నారు. ఇద్దరూ తాము చేస్తున్న ప్రయత్నం జాతి కోసం అంటూ అంటున్నారు. నిశితంగా పరిశీలించితే ఇద్దరు చంద్రుల జాతీయ రాజకీయాల పరమార్థం మాత్రం కేవలం తమ రాజకీయ అవసరాలే అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. 
 
తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇంకేముంది కేసీఆర్ స్వయంగా జాతీయస్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడాని కోసం అంటూ  ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్. ఎటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయాలు చెయ్యలేరు. అదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేయడం సాధ్యం కాదు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని ప్రాంతీయ పార్టీల కూటమి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చేసే ప్రయత్నం ప్రజలు నమ్మాలి కనుక పార్టీ బాధ్యతను వారసుడికి అప్పగించి ఎన్నడూ లేని విధంగా దేశ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారు.
 
ఇదిలాఉంటే ఎపీలో బాబుది మరో సమస్య ఎలాగూ విభజన తర్వాత ఏపికి కేంద్రం న్యాయం చేయలేదని ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన కనబడుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిలో లేదు. మళ్ళీ కేంద్రం సాయం చేస్తే తప్ప ఏపీ ప్రజలకు న్యాయం జరగదన్న భావావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసి విజయవంతంగా ప్రజలలో సజీవంగా ఉండేవిధంగా చేయగలిగినారు. అలా ప్రజల మానసిక స్థితి, రాజకీయ సమీకరణాలను అనువుగా చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిపి కూటమిగా బాబు ముందుకు వెళుతున్నారు. పనిలో పనిగా తన పాలన వైఫల్యాలు అసలు చర్చకు లేకుండా కూడా పోవడం తనకు కలిసి వస్తుంది అని బాబు ఆలోచనే జాతీయ రాజకీయమంటున్నారు విశ్లేషకులు. 
 
నాయకులు తెలివైనవారు కావచ్చు కానీ అన్ని సందర్భాల్లో నేతలు రాజకీయ ఎత్తులు వేసుకుంటూ విజయం సాధించలేరని చెబుతున్నారు విశ్లేషకులు. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత 40-50 స్థానాలు ఉన్న మమత, లాలూ, మాయావతి లాంటి పార్టీలు మౌనంగా ఉన్నాయి. వీరు తమ రాష్ట్రాలతో బాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావితం చేయగలరు. కానీ బాబు, కేసీఆర్‌ల రాజకీయ శక్తి 10కి ఎక్కువ 15కి తక్కువ. తెలుగు రాష్ట్రాలు దాటితే ఏమీ చేయలేని వారనే వాదనలు కూడా వున్నాయి. గడిచిన 4 ఏళ్లలో ఏమైనా కీలక విషయాలలో సరైన విధంగా స్పందించలేదంటున్నారు విశ్లేషకులు.
 
నోట్ల రద్దు, జిఎస్టీ, తమిళనాడులో గవర్నర్ వ్యవహారం లాంటి విషయాలలో కనీసం స్పందించలేదు. మమత, కేజ్రీవాల్ లాంటి వారు ఎంత ప్రయత్నించినా కనీస మద్దతు ఇవ్వని ముఖ్యమంత్రులు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇద్దరు చంద్రులు మాత్రమేనని విశ్లేషకుల వాదన. కేంద్రం గడిచిన కాలంలో చేసిన అన్నీ తప్పులను బలపర్చడం లేదా మౌనంగా ఉండటం మాత్రమే చేసిన ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారన్నది చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు