మూడు నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ముహూర్తం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 10 లోగా కంప్లీట్ చేయాలని భావించిన చంద్రబాబు, చినబాబుకు విఘ్నాలు ఎదురవుతున్నాయి. దసరాకు కాలేదు ఈసారి... దీపావళికి చిచ్చుబుడ్లలా కొందరి పదవులకు ఎసరు, మరికొందరికి అవకాశం దక్కుతుందని ఎదురుచూసిన ఆశావాహులకు నిరాశే ఎదురవుతుంది.
నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత కేబినెట్ టీమ్లో కొన్ని మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పార్టీలో వలసలకు గేట్లు తెరిచి 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. అందులో ముగ్గురు లేక నలుగురు నాయకులకు కేబినెట్ బెర్తు దాదాపు ఖాయమైంది. కొత్తనీరు వస్తే పాతనీరు పోవటం కామనే కాబట్టి ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరు లేక ముగ్గురికి ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది.
పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ను కేబినెట్ లోకి తీసుకోని విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించారు. కొత్త టీమ్ లోకి లోకేష్తో పాటు మరో నలుగురిని తీసుకోవాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. తొలుత అక్టోబరు 28 లేక నవంబరు పదో తేదీ లోపు అనుకున్నారు. కాని క్లైమెక్స్లో కథ అడ్డం తిరిగింది.
మంత్రివర్గ విస్తరణ ప్రచారం వినిపించగానే ఆశావాహులు గోతికాడి నక్కళ్లా సీఎంవో నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ నిద్రహారాలు మాని ఎదురుచూస్తున్నారు. టిడిపిలోకి వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తినట్లే... తెలంగాణలోనూ సైకిల్ దిగి తమ్ముళ్లు కారెక్కారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందంటూ కూనిరాగాలు తీస్తున్న టీటీడీపీ నేతలను... మరీ ఏపీలో జరుగుతుంది ఏమిటని ప్రశ్నిస్తే వారికి చిక్కువీడని ప్రశ్నే.
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పదవిలో ఎలా కొనసాగుతారంటూ పార్టీ ఫిరాయింపులపై టీటీడీపీ ఆందోళన చేయగా, కాంగ్రెస్ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.... వారిపైనా చర్యలు తీసుకోవటానికి ఎంత సమయం కావాలంటూ స్పీకర్ మధుసూదనచారిని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 8లోపు సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది.
తెలంగాణలో జంప్ జిలానీలపై స్పీకర్ ఇచ్చే సమాధానం, సుప్రీంకోర్టు ఇచ్చే తుదితీర్పు ఆధారంగా ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు నాలుగు అడుగులు వెనక్కి వేశారు. దీంతో మళ్లీ మంత్రివర్గ విస్తరణ అటకెక్కింది. లోకేశ్కు పట్టాభిషేకం ఆగింది. తొందరపడకుండా వేచిచూసే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. వైసీపీ వలసలను సమర్థించుకున్న టీడీపీ శ్రేణులు సుప్రీం తీర్పుతో ఇరకాటంలో పడ్డాయి. చంద్రబాబుకు సైతం ముందు నుయ్యి- వెనుక గొయ్యి తరహాగా మారింది. ఈ నెల 8న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రెండు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.