హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నగరంగా భాసిల్లుతోంది. అయితే, ఇటీవలి కాలంలో ఈ నగరం యువతీయువకుల సహజీవనానికి కేంద్రంగా మారుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ విధులు తదితరాలు యువతీయువకులను సహజీవనం వైపు నడిపిస్తున్నాయి. వీటిలో పెళ్లి దాకా సాగుతున్నవి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అనేక కేసుల్లో న్యాయం కోసం కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం హైదరాబాద్లోని కోర్టుల పరిధిలో, తాము సహజీవనం చేసి అన్యాయమై పోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ 15 మంది యువతులు వేసిన కేసులు విచారణ దశలో ఉన్నాయి. సహజీవనానికి చట్ట బద్ధత లేకపోవడం, ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే జీవనం గడిపినందుకు, అబ్బాయి చేసే మోసమేమీ లేదని కోర్టులు తీర్పిస్తుండటం యువతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని కేసులను వాదిస్తున్న న్యాయవాదులు వెల్లడించారు.
కుటుంబ కోర్టుల్లోని చాలా కేసుల్లో సహజీవనంపై కేసులు నడుస్తున్నాయి. విద్యార్హతలు తక్కువని, కులాలు వేరని, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని యువకులు చెబుతున్నారు. ఏ గుడిలోనో సాక్ష్యాలు లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆపై అవసరాలు తీర్చుకుని బంధాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు అంగీకరించని పరిస్థితి కూడా ఉంది. అత్యధిక కేసుల్లో అమ్మాయిలే మోసపోతున్నట్టు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.