కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

శనివారం, 22 సెప్టెంబరు 2018 (13:34 IST)
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి సర్కారుకు పెనుగండం పొంచివున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల్లో 20 మంది భారతీయ జనతా పార్టీ పంచన చేరేందుకు సిద్ధమై.. వారంతా రహస్య విమానంలో ముంబైకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తన మంత్రివర్గంలో కీలక నేతగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రి కుమార స్వామి అర్థగంటపాటు మంతనాలు జరిపారు.
 
సీఎం కుమారస్వామికేగాక సొంత పార్టీకి కూడా 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గట్టి ఝలక్‌ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. మంత్రి రమేశ్‌ జార్కిహోళి, ఆయన సోదరుడు సతీశ్‌ జార్కిహోళి ఆధ్వర్యంలో వీరు ముంబై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిజానికి బెళగావి జిల్లా కాంగ్రెస్‌ నేతల్లో తలెత్తిన అసమ్మతి సమసిపోయిందని బుధవారం అంతా భావించారు.
 
జార్కిహోళి సోదరులతో సమన్వయ కమిటీ ఛైర్మన్‌ సిద్దరామయ్య, సీఎం కుమారస్వామి రెండ్రోజులు మంతనాలు జరిపి వారిని బుజ్జగించారని, ఇక సంకీర్ణానికి ఢోకా లేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కానీ రాత్రికిరాత్రే పరిస్థితి తారుమారైంది. అసమ్మతి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరికి పూర్తి భద్రత కల్పించే బాధ్యతను మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తన మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌కు అప్పగించారు. 
 
తిరుగుబాటులో జార్కిహోళి సోదరులతో పాటు హొసకోట ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు, చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. ముంబై వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమగ్ర చర్చలు ముగిశాక వీరు కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు