ఏంటి "కుమార" ఈ అగ్నిపరీక్ష : విశ్వాస పరీక్షలో గట్టెక్కావా?

బుధవారం, 17 జులై 2019 (16:42 IST)
కర్నాటక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ బీజేపీ మాత్రం కనీస మెజార్టీకి ఐదు అడుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమై జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారు కొన్నాళ్ళ పాటు సాఫీగా సాగింది. అయితే, ఉన్నట్టుండి కాంగ్రెస్(13), జేడీఎస్ (3) పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 
 
వీరంతా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత కమలనాథుల రక్షణలోకి వెళ్లిపోయారు. దీంతో ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వానికి కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఆయన బలం 117 నుంచి 101కు పడిపోయింది. అదేసమయంలో బీజేపీ సంఖ్యాబలం 105 కాగా, కమలానికి మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ పార్టీ బలం 107కు చేరింది. 
 
కర్నాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224. ఇందులో 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 208కు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ 105కు తగ్గిపోయింది. కానీ, కుమార స్వామి వద్ద 101 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. బీజేపీ బలం 107గా ఉంది. 
 
అయితే, రాజీనామాలు చేసిన 16 రెబెల్స్ ఎమ్మెల్యేల భవితవ్యం స్పీకర్ చేతిలో ఉంది. వారి రాజీనామాలను ఆయన ఇంతవరకు ఆమోదించలేదు. తోసిపుచ్చలేదు. పైగా, రెబెల్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ - జేడీఎస్ అగ్రనేతలకు అందుబాటులోకి రావడం లేదు. వీరంతా పూర్తిగా కమలనాథుల రక్షణలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు కుమార స్వామి సిద్ధమయ్యారు. గురువారం విశ్వాస పరీక్ష జరుగనుంది. 
 
కానీ, ముఖ్యమంత్రి కుమార స్వామి మాత్రం విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే... ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని భావిస్తున్న బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మాత్రం తన ఎమ్మెల్యేలతో హ్యాపీగా క్రికెట్ ఆడుతున్నారు. మొత్తంమ్మీద కర్నాటక రాజకీయాల రసకందాయంలో సాగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు