రజినీ రాజకీయ సలహాదారుగా ధనుష్‌... వణుకుతున్న పన్నీర్, పళని

గురువారం, 10 ఆగస్టు 2017 (13:50 IST)
రజినీకాంత్ వెంట నడవడానికి తమిళనాడులో రాజకీయ పార్టీల నేతలందరూ సిద్థమవుతుంటే కుటుంబ సభ్యుల్లోని వారు కూడా ఆయన వెంట నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో ప్రధానంగా రజినీ అల్లుడు ధనుష్‌ సిద్థంగా ఉన్నారు. మామకు సలహాలు ఇవ్వడమే కాకుండా ఆయన వెంట నడిచి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో ధనుష్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా రజినీకి తెలిపారట ధనుష్‌. అల్లుడు సలహాదారుడుగా ఉంటానంటే ఎవరు మాత్రం కాదంటారు. అందులోను ఎప్పుడూ ఏ గొడవకు వెళ్ళకుండా.. తన పనేదో తాను చేసుకుపోయే ధనుష్‌ అంటే రజినీకి ముందు నుంచే ఇష్టం.
 
మరో రెండు వారాల్లో పార్టీని రజినీ ప్రకటించనున్న నేపథ్యంలో ధనుష్‌ రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించనున్నారట. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని ధనుష్‌ను సలహాదారుడిగా పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. ధనుష్‌ తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను దగ్గరి నుంచే గమనించారు. అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయాల గురించి తెలుసుకునేవారు ధనుష్‌. అదే చాలు తాను రాజకీయ సలహాదారుడిగా చేయడానికి అన్న నమ్మకంతో ధనుష్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు రజినీకాంత్ పార్టీ ఖాయం అనేది రూఢి కావడంతో అన్నాడీఎంకే పార్టీలో కదలిక వచ్చింది. భేషజాలకు పోయి పార్టీని నాశనం చేసుకునే కంటే అంతా కలిసి వుంటే మంచిదన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం ఇద్దరూ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15న పన్నీర్ సెల్వం తన ఎమ్మెల్యేలందరినీ అన్నాడీఎంకేలో విలీనం చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రజినీకాంత్ పార్టీ పెడితే తాము ఎవరికివారుగా వుంటే ఇక పార్టీ నామరూపాల్లేకుండా పోతుందన్న ఆందోళనలో నాయకులు వున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి