శోభకి మంత్రి పదవితోనే వచ్చిందా తంటా? ఏడుస్తున్న యడ్డీ?!!

సోమవారం, 26 జులై 2021 (17:42 IST)
అనుకున్నదే జరిగింది. ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటక సిఎంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. రెండు సంవత్సరాలుగా కర్ణాటక సిఎంగా ఉన్న యడ్యూరప్ప అనేక రాజకీయ పరిణామాల మధ్య పదవి నుంచి పక్కకి తప్పుకున్నారు. 
 
కర్ణాటకలో ఇది క్లైమాక్స్ సీన్. ఎట్టకేలకు రాజీనామా చేశారు యడ్యూరప్ప. ఆయనకు వయస్సు అడ్డంకిగా మారింది. బిజెపిలో 75 యేళ్ళు దాటిన వారికి పదవులు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. 
 
ఇప్పుడు యడ్యూరప్ప వయస్సు 77 యేళ్ళు. దీంతో ఆయన్ను రాజీనామా చేయాలని అధిష్టానం చెబుతూ వచ్చింది. సంప్రదింపులు కూడా జరిగాయి. పార్టీ అధినాయకత్వం చెప్పినట్లు వింటానంటూనే కొన్ని కండిషన్లు పెట్టారు యడ్యూరప్ప.
 
యడ్యూరప్ప రాజీనామా సడెన్‌గా తెరపైకి వచ్చింది కాదు. కొన్నాళ్ళుగా నలుగుతున్నదే. ప్రభుత్వంలో, పరిపాలనలో యడ్డీ కుమారుల జోక్యం పెరిగిందనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. 
 
కేంద్రమంత్రి వర్గ విస్తరణ తరువాత యడ్యూరప్పతో రాజీనామా చేయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్లు యడ్డీ సన్నిహితురాలు శోభకు కేబినెట్ పదవి ఇచ్చారు. దీంతో యడ్యూరప్పకు సాగనంపడం ఖాయమని తెలిసిపోయింది.
 
కర్ణాటకలో బిజెపి రావడానికి యడ్యూరప్పే కీలకం. ఒన్ మ్యాన్ షో నడిపారు. దీంతో ఆయన్ను సడెన్‌గా సాగనంపాలని అధినాయత్వం అనుకోలేదు. గౌరవప్రదంగా తప్పుకోవాలని చెప్పింది. ఇందులో భాగంగా ఢిల్లీకి పిలిపించి అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు.
 
ఈ సంధర్భంగా యడ్యూరప్ప కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తన కుమారుడికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నది అందులో ప్రదమంగా కనిపిస్తోంది. ఒకానొక దశలో తన కుమారుడిని సిఎం పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యడ్యూరప్ప భావించారు.
 
కానీ వారసత్వ రాజకీయాలను ఇష్టపడని బిజెపిలో అది గొంతెమ్మ కోర్కెకగా తేలిపోయింది. అటు బిజెపి నాయకత్వం అందరినీ ఒప్పించి యడ్యూరప్పను ఒప్పుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సిఎం రాజీనామా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు