4 గంటలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా.. యడ్యూరప్ప

సోమవారం, 26 జులై 2021 (13:21 IST)
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప సోమవారం ప్రకటించారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో సోమవారం జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని... కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందన్నారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
 
ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని... అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని చెప్పుకొచ్చారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ గహ్లోట్‌కు తన రాజీనామా పత్రాన్ని యడియూరప్ప అందించనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు