వేసవి కాలంలో వచ్చే వ్యాధులు.. అనారోగ్య సమస్యలేంటి?

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (10:05 IST)
వేసవికాలంలో పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువతుంటాయి. ఈ టెంపరేచర్ వల్ల కేవలం వేడి పెరగడమే కాకుండా పలు రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటివి ఎక్కువగా దాడి చేస్తాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే.. 
 
వేసవికాలంలో చర్మ సమస్యలు విజృంభించే అవకాశం ఎక్కువ. దీనికి రెండు కారణాలున్నాయి. వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదల కావడం వంటివి ఒకటైతే... సూర్యరశ్మిలోని అతినీలలోహిత (యూవీ) కిరణాల కారణంగా చర్మంలోని కణాలు దెబ్బతినడం రెండో కారణం.
 
ఎండాకాలంలో ఆస్తమా మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆస్తమా బాధితులు వేసవి కాలమంతా తమ వెంట ఆస్తమా ఉపశమన ఔషధాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. 
 
శోభి మచ్చలు సమస్య ఉన్నవారికి వేసవిలో ఈ బాధ మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే చర్మంపై ఫంగస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెద్దగా అయ్యే అవకాశముంది. విపరీతంగా చెమట పడుతుంది. మచ్చలు ఉన్న చోట దురద, స్వల్పంగా మంట కూడా వస్తుంది. 
 
ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడంతోపాటు సూర్యరశ్మిలోని అతినీలలోహిత (అల్ట్రా వయోలెట్-యూవీ) కిరణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ సేపు ఎండలో తిరిగితే.. చర్మం కమిలిపోతుంది. 
 
శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లూయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్‌లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్‌ల కన్నా ఇవి మరింత ప్రభావంతంగా ఉంటాయి. 
 
వేసవికాలంలో మూత్రనాళ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకూ వేసవి పరిస్థితులు కారణమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి