కరోనా సెకండ్ వేవ్ - మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఎలాగంటే?

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:43 IST)
కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.  తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.  
 
మన ఇంటి నుంచే మొదలవ్వాలి 
కరోనా వైరస్ రాకముందుతో పోలిస్తే మన దైనందిన కార్యక్రమాలలో ఊహించని మార్పులు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నాము. ఇవి రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలి. ముఖ్యంగా మన ఇంటి నుంచే ఈ మార్పులు మొదలవ్వాలి. పరిస్థితులు బయట ఎలా ఉన్నా ఇంట్లో ఉండాల్సి వస్తే అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనాను ఎదుర్కొనడం సులభమని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే మన రోజువారీ ఆహారంలో రోగనిరోధక శక్తిని ఇచ్చే వాటిని అలవాటు చేసుకోవాలి.
మాస్కు, శానిటైజర్, భౌతికదూరం కొనసాగించాలి
ముఖ్యంగా కరోనా వైరస్ కు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎలాంటి మందులు లేవు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. అది పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తి జరగకుండా బయటకు వెళ్తున్నపుడు మాస్కు ధరించడం, శానిటైజర్ వెంట తీసుకెళ్లడం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు భౌతిక దూరం పాటించడం, తరచూ సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకోవడం మన దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలి.

ఇప్పటిదాకా మనం కిరాణా షాప్‌కి వెళ్తే ఇంటికి అవసరమైన సరుకులు తెచ్చుకోవడానికే పరిమితమయ్యేవి. ఇక నుంచి మన లిస్టులో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటివి కూడా చేర్చాలి. కరోనా వైరస్ ఉన్నంతకాలం కాకుండా రాబోయే రోజుల్లో కూడా వీటిని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. 
 
స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యం
కరోనా వైరస్ నేర్పిన గుణపాఠాల్లో స్వీయ క్రమశిక్షణ ముఖ్యమైనది. మనం ఏం చేసినా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లినపుడు గానీ, ఏదైనా పనికోసం వెళ్లినపుడు ‘క్యూ’ లైన్లో నిలబడాల్సి వచ్చినా మనిషికి, మనిషికి మధ్య భౌతికదూరం ఉండేలా చూసుకోవాలి. దగ్గు, తుమ్ములు వచ్చినపుడు కర్చీఫ్ గానీ, మోచేతినిగానీ అడ్డు పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎదుటివారి మీద తుంపర్లుపడేలా మరీ దగ్గరగా కాకుండా దూరంగా ఉండి మాట్లాడాలి.  
ఆహారపు అలవాట్లు మారాలి
కరోనా వైరస్‌కు ముందు మన ఆహారపు అలవాట్లకు ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఉంటుంది. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలి. ముఖ్యంగా వేడివేడి పదార్థాలనే తినడం అలవాటు చేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టి రెండు మూడు రోజులపాటు తినే అలవాటును మానేయాలి. కేవలం రుచి కోసమే కాకుండా మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. నిజానికి జంక్ ఫుడ్‌తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు తక్కువే. ఫ్రిజ్‌లో పెట్టి చల్లని నీళ్లు తాగడం మానేసి గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.  
 
వ్యాయామం తప్పనిసరి
మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను సులభంగా ఎదుర్కొనవచ్చు. అదే మనశరీరం ధృడంగా లేకపోతే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. రోగనిరోధకశక్తి కోసం కోసం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. తీసుకున్న ఆహారాన్ని శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వ్యాయామాలు చేయాలి. ఇప్పటిదాకా వ్యాయామాలు చేయడం అలవాటు లేకపోతే ఇక నుంచయినా మొదలుపెట్టాలి. వ్యాయామం అనేది రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చేసుకోవాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా చేయాలి.  
 
వ్యక్తిగత పరిశుభ్రతా ముఖ్యమే 
కరోనా సమయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది అవసరమే. అత్యవసరమైన పనులున్నాయని, సమయం లేదని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కొనసాగించాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు మానుకోవాలి. 
 
పిల్లలు, పెద్దలపట్ల జాగ్రత్తగా ఉండాలి
పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరము, జలుబు, దగ్గు అవేవి మామూలు రోగాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. అదే తగ్గిపోతుందన్నట్టు ఉండొద్దు. అలాగని మెడికల్ షాపు నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు మంచి పోషకాహారం ఇవ్వాలి.  ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినట్టయితే డాక్టర్ ను సంప్రదించాలి. 
అత్యవసరం అయితేనే బయటివారిని కలవాలి 
టైంపాస్ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికారుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన అవసరం లేకపోయినా చూసినట్టు ఉంటుందని వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపులు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఈ కరోనా కాలంలో అవుట్ డోర్ మీటింగ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అత్యవసరమైతేనే వెళ్లాలి. వీలైనంత వరకు ఫోన్, ఆన్లైన్ చాటింగ్ ద్వారా పూర్తయ్యేలా చేసుకోవాలి. 
 
-డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు