ఎండు ద్రాక్షలు ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గాలంటే?

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:33 IST)
ఎండు ద్రాక్షలు, కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. 
 
కాబట్టి అనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. 
 
అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాలలో ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎండుద్రాక్షలు తక్కువ పరిమాణంలో కేలరీలు ఉండడమే కాకుండా, సహజంగా తియ్యగా ఉంటాయి. ఈ ఎండుద్రాక్షలను తరచూ తీసుకోవడం వల్ల అదనపు కేలరీలను తీసుకోవాలనే కోరికలను అణిచి వేస్తుంది. తద్వారా అధిక ఆహారం తీసుకోకుండా శరీర బరువును నియంత్రించడానికి ఎండు ద్రాక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. 
 
అదేవిధంగా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షలను మరుసటి రోజు ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఎండు ద్రాక్షలను కేవలం తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే శరీర బరువును తగ్గించుకోవచ్చు. 
 
ఎండుద్రాక్షలలో అధిక మొత్తంలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా లభిస్తాయి. ఈ పోషకాలు అధిక మొత్తంలో మన శరీరానికి అందడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు